'మావూరి కతలు' పాఠకుల గ్రామీణ జీవిత మూలాలను తాకుతాయి. పరాయీకరించబడుతున్న భాషా సంస్కృతులను గుర్తుచేస్తాయి. శూద్రేతర, గ్రామీణేతర పాఠకులకు కరువైన సామాజిక వ్యక్తుల్ని నిసర్గ పాత్రలుగా పరిచయం చేస్తాయి. పాఠకులకు తమాషా కలిగిస్తాయి. ప్రేమ కలిగిస్తాయి. దర్శనం కలగజేస్తాయి. కతలన్నీ చదివి కిందపెట్టేటప్పటికి మావూరి కతల్లోని పరిసరాల్లోకి ఇంకి, కథాసందర్భాల్లో తేలి, పాత్ర జీవ(న)స్పందనలుగా తర్జుమా కాబడిన పాఠకుడు, తన పరిమిత వ్యక్తిత్వం కోల్పోయి మొత్తం కురవపల్లెగా పరివ్యాప్తమవుతాడు. ఒక జీవితంలో అనేక జీవితాలు జీవించాలనే తృష్ణ పాఠకులకు ఉంటే; ఆ తృష్ణను ఈ కతలు తీరుస్తాయి. -బండి నారాయణ స్వామి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అనంతపురం